కరోనా మహమ్మారి ప్రభావం నుంచి చైనా దాదాపుగా బయటపడింది. ఇక దేశంలో అక్కడక్కడ ఒకటి రెండు కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 82, 883గా ఉన్నది. ఇక మరణాల సంఖ్య 4633గా ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి అన్నిరంగాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ పుట్టిన చైనాలోని హుబేయ్ ప్రావిన్సులో నేటి నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించారు. గ్రేడ్ 12, 9 విద్యార్థులకు సమ్మర్లో పరీక్షల సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా మార్చి నెలలోనే 12వ గ్రేడ్ విద్యార్థులకు స్కూళ్లు ప్రారంభం అయ్యాయి.
అయితే.. ఇక్కడ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రావిన్సులో పాఠశాలలకు వెళ్లే పిల్లలు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. భౌతిక దూరం లాంటి నిబంధనలు కూడా పాఠశాలలో తప్పకుండా పాటించాలి. హుబేయ్ ప్రావిన్సులో ఉన్న వుహాన్ నగరంలోనే గత ఏడాది డిసెంబర్లో కరోనా వైరస్ కేసులు తొలుత బయటపడిన విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గత 32 రోజుల నుంచి అక్కడ కొత్త కేసులు లేవు.