జగన్ ఏది చేసిన ఒక సంచలనమే. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వరకు ప్రతి దశలోనూ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ వచ్చారు. అలాగే ఏపీలో వైసీపీ అధికారం దక్కించుకోవడం ఒక సంచలనమే. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనంగానే మారుతూ వచ్చింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి ఎంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, జగన్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయం ఎక్కడా మార్చుకునేందుకు ఇష్టపడలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లో తీసుకున్న సౌర విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. టిడిపి ప్రభుత్వంలో అడ్డగోలు కమిషన్ లతో పవన విద్యుత్, సౌరవిద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీలు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారని, అందుకే ఆ రేట్లు తగ్గిస్తున్నాం అంటూ జగన్ ప్రకటన చేశారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది.
ఇక అప్పటి నుంచి డబ్బు చెల్లింపులు చాలావరకు ఆపేశారు. దీనిపై విద్యుత్ ప్లాంట్ యాజమాన్యాలు రెగ్యులేటరీ కమిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించాయి. అయినా దీనిపై ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ఇక అప్పటి నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పెద్దగా కంపెనీలకు డబ్బులు చెల్లించడం లేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా మొత్తం చెల్లింపులనే జగన్ నిలిపి వేశారు. ఈ ప్లాంట్లలో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ యాజమాన్యాలు మోదీ ప్రభుత్వానికి దీనిపై లేఖలు కూడా రాసారు. కేంద్ర ఇంధన శాఖ కూడా ఘాటుగా జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రెండు మూడుసార్లు లేఖలు కూడా రాశారు. ఏపీలో మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, జగన్ కు బెదిరింపులు తో కూడిన బుజ్జగింపులు చేసినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ఇష్టపడలేదు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రం 2003 విద్యుత్ చట్టాన్ని సవరించి కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 21 రోజుల్లో అభ్యంతరాలు, సలహాలు ఉంటే చెప్పాలంటూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ సవరణ చట్టం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కొత్త విద్యుత్ చట్టానికి కట్టుబడి ఉండాల్సిందే. విద్యుత్ కొనుగోళ్లు వ్యవహారాలు పర్యవేక్షించేందుకు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇది గనుక అమల్లోకి వస్తే జగన్ నిర్ణయాలకు ఇది వ్యతిరేకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ పవన, సౌర విద్యుత్ ఒప్పందాల్లో ఉన్నట్టుగానే విద్యుత్తును కొనాల్సిందే. అలా కొనకపోతే యూనిట్ కు 50 పైసల చొప్పున కరెంట్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఈ చట్టంలో అనేక మార్పులను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రతి డిస్కమ్ ఏ సంవత్సరం లెక్కల్ని ఆ సంవత్సరమే సరి చూడాలి. ఆ భారాన్ని వచ్చే సంవత్సరంలో వినియోగదారులపై భారం మోపేందుకు కుదరదు.
అలాగే ఇప్పుడు రా సబ్సిడీ, ప్రభుత్వ సబ్సిడీ కలిపి గృహ విద్యుత్ వినియోగదారులకు కొంత రిలీఫ్ ఇస్తున్నాయి. ప్రభుత్వమే సబ్సిడీ సొమ్ముని డిస్కమ్స్ కి చెల్లిస్తుంది. అయితే ఇకపై వాస్తవ ధరను వినియోగదారుల నుంచి వసూలు చేయబోతున్నారు. ఆ తర్వాత సబ్సిడీ సొమ్మును నేరుగా వినియోగదారుల ఖాతాల్లో వేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
అలాగే వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును దుర్వినియోగం చేస్తున్నారనే సమాచారంతో పాటు, సబ్సిడీ లెక్కల్లో గోల్ మాల్ జరుగుతుందన్న ఆరోపణలపై మొత్తం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ రీడింగ్ పెట్టి వినియోగాన్ని పక్కాగా రికార్డు చేసేందుకు కొత్త చట్టంలోని నిబంధనలు రూపొందించారు.
ఇక పెద్ద పెద్ద ట్రాన్స్ మిషన్ లైన్స్, సబ్ స్టేషన్ లైన్స్ మెయింటినెన్స్ ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రాంతాల వారీగా కరెంటును పంపిణీ చేసే బాధ్యతను కాంట్రాక్టు, ప్రైవేటు సంస్థలకు ఇచ్చి విద్యుత్ రంగం రూపు రేఖలను మార్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక ఇప్పటివరకు రెగ్యులేటరీ కమిషన్ లను రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తున్నాయి. అయితే ఇకపై కేంద్రంలోని ఓ కమిటీ ఈ నియామకాలను చేస్తుంది. ఈ కమిటీలో సుప్రీం కోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉండబోతున్నారు.