జానెడు పొట్టి నింపుకోవడానికి కాయకష్టం చేసుకునే కుటుంబం. వృత్తిపని చేస్తూ చేతులు లాగుతున్నాయి బిడ్డా అంటే.. ఆ కొడుకు మనసు తల్లడిల్లిపోయింది. పేదరికమే అతనిలో కసిని పెంచింది. ఆలోచించాడు. అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇప్పుడు అతన్ని ప్రపంచం గుర్తించింది. అతన్ని సగర్వంగా సత్కరిస్తోంది సమాజం.
ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరిగెడుతుంటే నేతన్నలు ఇంకా శారీరక శ్రమనే నమ్ముకుంటున్నారని ఆలోచించాడు. శ్రమకు సరైన పరిష్కారం కోసం అనుక్షణం కష్టపడ్డాడు. చుట్టూ ఉన్నవాళ్లు అవమానపరిచినా, తన గమ్యాన్ని మాత్రం మరవలేదు. ఆటుపోట్లనే మెట్లలా చేసుకొని లక్షల మంది నేతన్నల బతుకుల్లో మార్పును తీసుకొచ్చిన "ఆసు యంత్రం"ను కనిపెట్టాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. ఇది క్లుప్తంగా చింతకింది మల్లేశం విజయగాధ. ఈ విజయం అతనికి ఆషామాషీగా ఏమీ లభించలేదు. కలకు, వాస్తవానికి మధ్య ఏళ్లపాటు జరిపిన మధనంలో అద్భుత ఆవిష్కరణను సృష్టించాడు.
తన తల్లి బాధను దూరం చేయడానికి లక్ష్మీ ఆసు యంత్రం తయారుచేసి ఎందరో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాడు చింతకింది మల్లేశం. అమ్మకోసం పడ్డ తపన ఇప్పుడు చేనేత కార్మికుల కన్నీళ్లను తుడుస్తున్నది. అమ్మకోసం పడ్డ తపన ఇప్పుడు చేనేత కార్మికుల కన్నీళ్లను తుడుస్తున్నది. తల్లి భుజం కోడిన శ్రమ అందరి జీవితాలను భుజాన వేసుకునేలా చేసింది. ఇప్పటిదాకా 800లకు పైగా ఆసు యంత్రాలను తయారుచేసిన మల్లేశం పేరు.. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. ఆయన ఆవిష్కరణకుగాను కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నాడు.
యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని శారాజీపేటకు చెందిన నేతకారుడు చింతకింది మల్లేశం. నిరుపేద చేనేత కుటుంబం. అమ్మచీరలు నేస్తుంది. ఆమె రోజంతా ఆసు పోస్తేగానీ ఒక చీర తయారుకాదు. పిన్నుల చుట్టూ 9వేల సార్లు దారాన్ని తిప్పుతుంది. అంటే దాదాపు 12 నుంచి 13 కిలోమీటర్ల దూరమంత పొడవు. అలా రోజుకి 18వేల సార్లు కండెల చుట్టూ తిప్పాలి. అలా చేస్తేగానీ రెండు చీరలు తయారుకావు. మెడ లాగేస్తుంది. వేళ్లు పీక్కుపోతాయి. భుజం పట్టేస్తుంది. కంటిచూపు దెబ్బతింటుంది. తల్లి పడుతున్న బాధ మల్లేశాన్ని కదిలించింది. అమ్మ కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చేయాలని మనసులో బలంగా నాటుకుంది. దీనికి పరిష్కారంగా ఒక మెషీన్ లాంటిది కనిపెడితే ఎలా వుంటుందీ అని ఆలోచించాడు. ఆలోచించిందే తడవుగా తన ఐడియాను ఇరుగుపొరుగుతో పంచుకున్నాడు. కానీ, వాళ్లు అది అయ్యే పనికాదు వదిలేయ్ అన్నారు. మిషన్లు, మోటార్లు నీకెక్కడివి అని నిరుత్సాహ పరిచారు. దానికయ్యే ఖర్చు గురించి ఆలోచించావా అని హెచ్చరించారు. అయినా మల్లేశం ఆశ చావలేదు. సాధించి తీరుతాననే నమ్మకం ఉంది. అక్కడే ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని.. హైదరాబాద్ వచ్చాడు. అక్కడే ఒక పార్ట్ టైం జాబ్ చూసుకున్నాడు.
ఉద్యోగం చేస్తున్నాడు కానీ, మనసంతా యంత్రం మీదనే ఉంది. పరిశోధిస్తూ, ఆలోచనలకు పదును పెడుతూ ఒక్కో పార్ట్ జతచేశాడు. రోజుకి కొంత చొప్పున అలా ఏడేళ్లు కష్టపడి, యంత్రానికి ఒక రూపం తీసుకొచ్చాడు. ప్రాణాలు లేచివచ్చాయి. ఇంటిదగ్గర తల్లి కళ్లముందు కదలాడింది. అమ్మకు ఇక ఎలాంటి కష్టం ఉండదని కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక్క తన తల్లి కోసమే కాదు.. తన ఊరిలో చేనేత కుటుంబాల్లోని ఎందరో తల్లుల బాధలను ఈ మిషన్ గట్టెక్కిస్తుందని సంతోషించాడు.
మిషన్ అంటే యంత్రాలతో హడావిడిగా వుండదు. రెండు తక్కువ కెపాసిటీ గల మోటార్లు, వుడ్ ఫ్రేమ్ మాత్రమే ఉంటాయి. శారీరకంగా ఎలాంటి శ్రమ ఒత్తిడీ ఉండదు. ఇంటిపని వంటపని చూసుకుంటూనే, వీలైనన్ని చీరలకు ఆసుపోయవచ్చు. టైం చాలా ఆదా అవుతుంది. ప్రొడక్షనూ పెరుగుతుంది. రోజులో రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం ద్వారా 6 నుంచి7 నేస్తారు. మామూలు ఆసు యంత్రం ద్వారా ఒక చీర నేయడానికి సుమారు ఐదు గంటలకుపైగా సమయం పడుతుంది. కానీ ఈ మిషన్ ద్వారా అయితే కేవలం గంటన్నరలో అయిపోతుంది.
ఇప్పటిదాకా 800లకు పైగా ఆసు యంత్రాలను తయారు చేశాడు. ఒక్కోదాని ఖరీదు 25వేలు. ఆరో తరగతిలోనే చదువు ఆపేసి, 8 ఏళ్లు కష్టపడి, లక్ష్మీ ఆసుయంత్రం ఆవిష్కరించిన మల్లేశం పేరు.. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. మొదటి ఏడాదిలో 60 మిషన్లు తయారు చేశాడు. 2002 నుంచి 2004 వరకు సంవత్సరానికి వంద మిషన్ల చొప్పున బిగించాడు. 2006లో యంత్రానికి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు జతచేశాడు.
లక్ష్మీ ఆసుయంత్రం ఆసియాలో ద బెస్ట్ అని అమెరికాకు చెందిన పాబ్ లాబ్స్ ప్రశంసించింది. అదే ఏడాది ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. 2010లో పేటెంట్ హక్కులొచ్చాయి. అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాలో మల్లేశం పేరు వచ్చింది. 2011లో ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికాకు చెందిన ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఇలా అనేక ప్రశంసలు, అవార్డలు, రివార్డులు అందుకున్న మల్లేశాన్ని కేంద్రం.. పద్మశ్రీతో సత్కరించింది.
ఆసు యంత్ర ఆవిష్కర్త చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారం ఇటీవల మల్లేశం పేరుతో సినిమా వచ్చింది. ఈ సినిమాతో మల్లేశం పేరు మరోసారి మారుమోగిపోయింది. మల్లేశం కష్టాన్ని అందరు గుర్తిస్తున్నారు. ఆలోచనలకు, ఆవిష్కరణలకు చదువుతో పనిలేదని నిరూపించిన మల్లేశం జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.