చంద్రబాబు నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కని ఎత్తులు లేవు, చూడని శిఖరాలు లేవు. అదే సమయంలో చంద్రబాబు వీటిని ఎలా అధిరోహించారా అన్న చర్చ వచ్చినపుడు ఆయన వెన్నుపోటు రాజకీయం కూడా బయటపడుతుంది. పిల్లను ఇచ్చి అల్లుడిగా చేసుకుని పార్టీలో ఉన్నత స్థానం, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తే మామ అని కూడా చూడకుండా ఎన్టీయార్ని వెన్నుపోటు పొడిచిన అపకీర్తిని బాబు దక్కించుకున్నారు.
ఇక కాంగ్రెస్ లో ఓ సాధారణ నేతగా ఉన్న బాబుని ఆ పార్టీ ఆదరించి ఎమ్మెల్యేను, ఆనక మంత్రిని చేస్తే ఆ పార్టీ ఓడిపోగానే దాని వదిలేసి మామ పెట్టిన టీడీపీలో చేరిపోయిన చరిత్రా బాబుదే అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే పొత్తుల పేరిట ఎత్తుల పేరిటా బాబు అనేక పార్టీలను వాడుకుని వదిలేశారని విమర్శలు ఉన్నాయి.
ఇక కులాల సమీకరణలో, వాటిని ఉపయోగించుకునే విషయంలోనూ బాబుది అందెవేసిన చేయే. బాబు బీసీలను మోసం చేశారని గత ఎన్నికల్లో జగన్ గట్టిగా నినదిస్తే ఆ వైసీపీకి గుత్తమొత్తంగా బీసీ ఓటు బ్యాంక్ టర్న్ అయింది. సరే బాబు ఎవరిని మోసం చేసినా తన సొంత సామాజికవర్గం పట్ల ప్రేమతో ఉన్నారని, వారికోసమే ఆయన అమరావతి రాజధాని తెచ్చారని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి.
అయితే అందులో కూడా పూర్తిగా నిజం లేదని, బాబు డబ్బున్న కమ్మ వారి పక్షంగానే ఉన్నారని పేదలైన కమ్మలను కూడా ఆయన మోసం చేశారని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అంటున్నారు. అమరావతి రాజధాని పేరిట పేద కమ్మలను వంచించిన చరిత్ర బాబుదని, వారి నుంచి ముక్కారు పంటలు పండే భూములు బలవంతంగా లాక్కుని అటు రాజధాని నిర్మించలేక ఇపుడు ఎటూ కాకుండా చేశారని ఆమె మండిపడ్డారు.
ఇపుడు బాబు తీరు చూసి సొంత సామాజికవర్గమే ఆగ్రహంగా ఉందని ఆమె అంటున్నారు. బాబుకు మోసం చేయడం ఒక్కటే తెలుసు అని, అందులో కమ్మలు కూడా ఉన్నారని, వారు బాబు వల్ల మా బతులుకు ఇలా అయ్యాయని ఆవేదన చెందుతున్నరని అసలు గుట్టు బయటపెట్టారు.