ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కరోనా లక్షణాల విషయంలో మరిన్ని లక్షణాలు తోడయ్యాయి. కరోనా వైరస్ సోకిన వ్యక్తిలో వ్యాధి తీవ్రతరం ఎక్కువైతే కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ సోకిన వ్యక్తిలో జలుబు, దగ్గు, శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా అవి కాకుండా చలి, చలితో వణకడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, రుచి, వాసన శక్తిని కోల్పోతున్నట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన వ్యక్తిలో 2 నుంచి 14 రోజుల మధ్య ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉందని తెలిపింది. గుండెల్లో నొప్పి, గుండెలపై ఒత్తిడి, పెదాలు, మొహం నీలం రంగులోకి మారుతున్నట్లు యూఎస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వెల్లడించింది.
కాగా, రష్యాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఆ దేశంలో సోమవారం కొత్తగా 6,198 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతకుముందు రోజు కూడా 6,361 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 87,147కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 50 మంది కరోనా వల్ల చనిపోయారని రష్యా అధికారులు తెలిపారు. అతిపెద్ద దేశం రష్యా కోవిడ్-19 కేసుల సంఖ్య కరోనా మహమ్మారి పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనా( కరోనా కేసుల సంఖ్య 82,830)ను కూడా దాటేసింది.
ఇదిలాఉండగా, కరోనా సంక్షోభం కారణంగా భారత ఆర్థిక వృద్ధిరేటు దాదాపు మూడు దశాబ్దాల నాటికి పడిపోనుదని ఇండియా రేటింగ్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) తెలిపింది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు కేవలం 1.9శాతమే ఉండనుందని, గత 29 ఏండ్లలో ఇదే అతి తక్కువ అని పేర్కొంది. మే 3వరకు లాక్డౌన్ కేంద్రం ప్రకటించినప్పటికీ వచ్చే నెల మధ్యవరకు పాక్షిక లాక్డౌన్ కొనసాగవచ్చని, దీనిని దృష్టిలో పెట్టుకొని వృద్ధిరేటు సవరించిన అంచనాలను విడుదలచేసినట్లు ఈ రేటింగ్ సంస్థ తన రిపోర్టులో సోమవారం వెల్లడించింది. మార్చి 30న ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ ఏడాది వృద్ధిరేటు 3.5శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.