వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అసలు దోషులెవరు, సూత్రదారులెవరు అన్న విషయాలు ఎప్పటికి తేలుతాయో తెలీదు. అయితే వైఎస్ కుటుంబంలోని వాళ్ళల్లోనే చాలామంది వివేకా కూతురు సునీతను నమ్మటంలేదని అర్ధమవుతోంది. తాజాగా వివేకా సోదరి విమలారెడ్డి కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిని చూసేందుకు విమల వచ్చారు. ఇంతకీ విమల ఏమంటారంటే వివేకాను చంపాల్సిన అవసరం అవినాష్ కుటుంబానికి లేదన్నారు.





అవినాష్ కుటుంబం తన సోదరుడు వివేకాను చంపించిందంటే తాను నమ్మనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. హత్యజరిగిన కొత్తల్లో వైఎస్ కుటుంబంలో ఎవరూ ఈ హత్యకు పాల్పడుండరని స్వయంగా సునీతే చెప్పిన విషయాన్ని విమల గుర్తుచేశారు. జరిగిన హత్యకు వైఎస్ కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదని చెప్పిన సునీత తర్వాత ఎందుకు మాట మార్చారో కూడా తనకు తెలీటంలేదన్నారు. వివేకాను హత్యచేసిన వాళ్ళేమో హ్యాపీగా బయటతిరుగుతుంటే సంబంధంలేని అవినాష్ కుటుంబం  కేసులో ఇరుక్కున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.





తప్పుచేయని అవినాష్ ను సునీత ఎందుకు టార్గెట్ చేస్తోందో అర్ధంకావటంలేదన్నారు. అవినాష్ ను టార్గెట్ చేయటం చాలా తప్పన్నారు. సునీత చుట్టూ కొన్ని దుష్టశక్తులు చేరినట్లు మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసి అవినాష్ కుటుంబాన్ని ఇరికించటంతో తల్లి లక్ష్మి కుమిలిపోతున్నట్లు విమల బాధపడ్డారు.





చిన్నప్పటినుండి అవినాష్ తనకు బాగా తెలుసన్నారు. అవినాష్ తప్పుచేశాడంటే తాను నమ్మటంలేదని కూడా చెప్పారు. తాను చేస్తున్నది తప్పని చెప్పటం వల్లే సునీత తమతో మాట్లాడటం మానేసిందన్నారు. అవినాష్ కు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని విమలారెడ్డి చెప్పారు. మొత్తానికి విమల తాజా మాటలతో సునీతకు వైఎస్ కుటుంబంలోని దగ్గరబంధువుల్లోనే మద్దతులేదన్న విషయం అర్ధమవుతోంది. హత్యజరిగిన కొత్తల్లో చంద్రబాబునాయుడు, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి లాంటి వాళ్ళపై అనుమానాలు వ్యక్తంచేసిన సునీత తర్వాత ఏమైందో ఏమో అవినాష్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: