గజిబిజి.. బిజీబిజీ లైఫ్.. ఉదయం షిఫ్ట్లో భార్య డ్యూటీ.. సాయంత్రం షిఫ్ట్లో భర్త డ్యూటీ.. ఒకరు ఇంటికి వస్తుంటే మరొకరు డ్యూటీకి వెళ్లే సందర్భాలు.. అబ్బా..కనీసం ఏకాంతంగా నాలుగు ముచ్చట్లు మాట్లాడుకోవడానికైనా సమయం దొరకదు.. ఇక భర్త ఒకచోట.. భార్య మరో చోట ఉద్యోగం.. ఎప్పుడో వారానికి ఒకసారి కలుసుకునే అవకాశం వస్తే వస్తుంది.. లేదంటే అంతేసంగతులు.. కంపెనీ యాజమాన్యం ఒత్తిడి భరించలేక బాస్.. బాస్ పోరుభరించలేక ఉద్యోగులు.. తీవ్ర ఒత్తిడితో ఇంటికి చేరుకుని నీరసించపోవడం.. వేలకు వేలు.. లక్షల్లో జీతం వస్తున్నా.. ఎక్కడో జీవితం మిస్ అవుతున్నామన్న ఫీలింగ్.. ఈ ఒత్తిడిలో సెక్స్ జీవితం అంతకన్నా సున్నా..! ఇలాంటి జీవితాలకు కరోనా వైరస్ పుణ్యమాని కాసింత ఉపశమనం కలిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ విధించాయి. ఇళ్లకే పరిమితం కావాలని ఆంక్షలు విధించాయి. ఇంకేముంది.. సుమారు 20రోజులు ఇంటివద్దే ఏకాంతంగా గడిపే అవకాశం జంటలకు దక్కింది.
రోజూ అలిసిపోయి ఇంటికి చేరుకునే వారికి కాసింత విశ్రాంతి దొరికింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా కండోమ్స్, వయాగ్ర, గర్భనిరోధక, రుతుస్రావం నిలిచిపోయే మాత్రల అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయినట్లు ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా తెలుస్తోంది. భారత్లో కూడా లాక్డౌన్ నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయని పలు ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. లాక్డౌన్ ఏకంగా ఏప్రిల్ 14వ తేదీ.. లేదా మళ్లీ పొడిగించే అవకాశం ఉందని, అందుకే వీటి అమ్మకాలు బాగా పెరిగాయని చెబుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు దాంపత్య జీవితానికి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదన్న వైద్యుల సూచనలతో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పలు జంటలు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కండోమ్స్, గర్భనిరోధక, వయాగ్ర మాత్రల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కండోమ్స్ కొరత కూడా ఏర్పడింది. ఎందుకంటే.. కండోమ్స్ ఉత్పత్తి చేసే పలు దేశాల్లో లాక్డౌన్ నేపథ్యంలో ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ప్రతీ ఐదు కండోమ్స్లో మలేషియాకు చెందిన కారెక్స్ బీహెచ్డీ కంపెనీయే ఒకటి తయారు చేస్తుంది. అయితే.. ఈ దేశంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఇక్కడ లాక్డౌన్ విధించింది ఇక్కడి ప్రభుత్వం. దీంతో ఈ దేశంలో కండోమ్స్ తయారు చేసే కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి. అలాగే, చైనా, భారత్తోపాలు మరికొన్ని దేశాల్లో కూడా కండోమ్స్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు డిమాండ్ పెరిగింది.. మరోవైపు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మలేషియాకు చెందిన ఓ కంపెనీ.. తమ ప్రభుత్వానికి విన్నవించింది. లాక్డౌన్లోనూ పరిమిత కార్మికులతో కండోమ్స్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని కోరింది. కానీ.. ఇప్పట్లో ఉత్పత్తిని ప్రారంభించే అవకాశమే లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!