తెలుగు సినిమా పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి లెజెండరి హీరోల మరణాలు వారి కుటుంబాలని, అభిమానులని ఇంకా సినిమా ఇండస్ట్రీని బాధతో నింపాయి. ఇక తాజాగా ప్రముఖ సీనియర్ నిర్మాత అయిన జీవీజీ రాజు భార్య పద్మజా రాజా మంగళవారం (డిసెంబర్‌20) నాడు మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జరిగింది.ఈమె ఎవరో కాదు అలనాటి తరం అందాల హీరో హరనాథ్‌ కూతురే పద్మజా రాజు. మరణించేనాటికి ఆమె వయసు 54 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక పద్మజా రాజు సోదరుడు శ్రీనివాసరాజు కూడా ఓ నిర్మాతనే. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన గోకులంలో సీత ఇంకా తొలిప్రేమ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను పద్మజా రాజు భర్త జీవీజీ రాజు నిర్మించారు. అలాగే అక్కినేని హీరో అయిన సుమంత్‌- శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ మూవీ గోదావారి కూడా ఈ ప్రొడక్షన్ బ్యానర్‌ నుంచి వచ్చిన సినిమానే.


ఇక రీసెంట్ గా పద్మజారాజు తన తండ్రి హరనాథ్ జీవిత విశేషాలతో ‘అందాలనటుడు’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని లాంచ్ చేశారు.ఈ మధ్యనే పద్మజా రాజు మాట్లాడుతూ.. త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం చేస్తున్నట్టు కూడా తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి తన ఇంటి నుంచి మరో నిర్మాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని పద్మజా రాజు చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే ఆమె చనిపోవడం చాలా విషాదకరం. పద్మజా చనిపోవడంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఇంకా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. బుధవారం (డిసెంబర్‌21) నాడు ఉదయం మహా ప్రస్థానంలో హరనాథ్‌ కూతురు పద్మజా రాజు గారి అంత్యక్రియలు జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: