
పార్టీలకు అతీతంగా ఉద్యమ శక్తులన్నింటినీ కలుపుకుపోవల్సిన టిజెఎసిని టిఆర్ఎస్ కు వత్తాసు పలికే సంస్థగా మార్చారని కొంతమంది ధ్వజమెత్తినట్లు సమాచారం. సంసద్ యాత్ర సందదర్భంగా ఎంతో శ్రమకోర్చి, ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికిని ఢిల్లీకి రైలులో వెళ్లితే టిఆర్ఎస్ నాయకులు విమానంలో వచ్చి హడావుడి చేశారని విమర్శించినట్లుగా తెలుస్తుంది. అదే విధంగా సంసద్ యాత్ర సందర్భంగా కష్టపడితే టిజెఎసి అధికార ప్రతినిధిని కూడా సమావేశంలో మాట్లాడనివ్వలేదని వారు తప్పుపట్టారు.
దీంతోపాటు మహబూబ్ నగర్ జిల్లా జెఎసి అధ్యక్షున్ని మార్చాలని పట్టుబట్టగా మార్చే ప్రసక్తి లేదని, ఇలా మార్చుకుంటూ పోతే ఎవరు మిగులరని కోదండరామ్ తేల్చిచెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో కొంతమంది నాయకులు మార్చకపోతే నష్టం జరుగుతుందని అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. గతంనుండి టిఆర్ఎస్ కు అనుబంధసంస్ధగా ఉన్న జెఎసిపై అపోహ తొలగించడం కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తుండగా ఆచరణలో సాధ్యం కావడంలేదు. టిఆర్ఎస్ నాయకులు చెప్పుచేతుల్లోనే జెఎసి నడుస్తుందనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న కోదండరామ్ ఒంటరి అయిపోతాడను భయం ఆయన్ని వెంటాడుతుంది. మహబూబ్ నగర్ ఉప ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు కోదండరామ్ కు గుణపాఠంగా మారడంతో టిఆర్ఎస్ కు జెఏసి అనుబంధంగా పనిచేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది. ఇటువంటి విధానం మంచిది కాదని ఎవరైన వ్యతిరేకిస్తే వారు జెఏసికి దూరం కావచ్చుగాని టిఆర్ఎస్ కు మాత్రం జెఎసి దూరం కాదనే విషయం అర్ధమైంది.