
భారత్ తీసుకున్న ఈ చర్య పాకిస్థాన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ – పాకిస్థాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనినే "ఇండస్ వాటర్స్ ట్రీటీ" అంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ (సింధు) నదీ వ్యవస్థలోని 6 నదుల నీటిని 2 దేశాల వారు పంచుకోవాలి. తూర్పు నదులు అయినటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి నియంత్రణ ఉంది. ఇవి సుమారు 33 మిలియన్ ఎకర్-ఫీట్ నీటిని అందిస్తాయి. భారత్ ఈ నీటిని పంజాబ్, హరియాణాతో పాటు రాజస్థాన్లో సాగు అవసరాలకు, జలవిద్యుత్ ఉత్పత్తికి వెడుతోంది. 2019 నివేదిక ప్రకారం భారత్ తన వాటా నీటిని 95% వినియోగించుకుంది.
అలాగే పశ్చిమ నదులు అయినటువంటి సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్కు ఎక్కువ నియంత్రణ కలదు. ఇవి సుమారు 135 MAF నీటిని అందిస్తాయి. ఇది సింధు నది వ్యవస్థ మొత్తం నీటిలో 80%. భారత్ ఈ నదుల నీటిని పరిమితంగా, విద్యుత్ ఉత్పత్తి, నావిగేషన్, చేపల సాగు వంటి అంశాల కోసం మాత్రమే వాడుకుంటోంది. కానీ నీటి ప్రవాహాన్ని నిలిపివేయడం, నిల్వ చేయడం ఒప్పందం ప్రకారం అయితే కుదరనే కుదరని పని. ఈ ఒప్పందం 1965, 1971, 1999లో జరిగిన యుద్ధాలు మరియు ఇతర ఉద్రిక్త సమయాల్లో కూడా కొనసాగింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఉదారమైన నీటి పంపిణీ ఒప్పందంగా వ్యూహాత్మక నిపుణుడు బ్రహ్మ చెల్లానీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే అయితే ఈ ఒప్పందం భారత్కు అనుకూలంగా లేదని, దీని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన తెలిపారు. పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని విడనాడే వరకు ఇండస్ వాటర్స్ ట్రీటీని “అబెయన్స్”లో ఉంచాలని నిర్ణయించారు. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సి వుంది!