
నిరుడు అంటే 2019 – 20 సం.లో చైనాలోని వుహాన్ నగరంలో కొవిడ్-19 బయట పడింది మొదలు ఇప్పటి వరకు ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇందులో మెజారిటీ చైనాను నిందించేవి కావడం గమనార్హం.
వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో ఈ వైరస్ ను కృత్రిమంగా తయారు చేస్తున్నారని, ఈ క్రమం లోనే ప్రమాదవశాత్తూ బయట పడిందని కూడా విశ్లేషణలు వచ్చాయి. అయితే, ఇదంతా అసత్యమని చైనా వాదిస్తూ వచ్చింది. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం మరికొన్ని చైనా ఊహాతీత ప్రమాదకర అంశాలకు తెరతీసింది. మరోసారి కొత్త కొత్త సంచలనాత్మక అనుమానాలకు తావిస్తుంది.
ఆ స్ట్రేలియాకు చెందిన మీడియా ఈ మేరకు కథనం ప్రచురించింది. దాని ప్రకారం, 2015 సంవత్సరంలోనే కరోనా వైరస్ తో జీవాయుధాలను తయారు చేయడంపై చైనా శాస్త్రవేత్తలు చర్చించారట. మూడో ప్రపంచ యుద్ధం అనేది జరిగితే, అది జీవాయుధాల తోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక పత్రంలో పేర్కొన్నట్టు ఆస్ట్రేలియన్ మీడియా తెలిపింది. ‘సార్స్ కరోనా వైరస్’ లను నూతన శకం జీవాయుధాలుగా డ్రాగన్ కంట్రీ చైనా భావిస్తోందని వెల్లడించింది.
జీవాయుధాలతో దాడిచేస్తే శత్రుదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తొ పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థ కుప్ప కూలిపోతుందని చైనా సైన్యం భావిస్తోందట. కరోనా వైరస్ 2019 లో బయట పడినప్పటికీ అంతకు ఐదేళ్ల ముందు నుంచే చైనా సైన్యం లోని శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్ తో ఆయుధాలను తయారు చేయడంపై చర్చిస్తున్నట్టు ఆ మీడియా కథనం తెలిపింది.
కాగా, దీన్ని బలపరిచే ఆధారాలతో కూడిన పలు పత్రాలు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు లభించినట్టు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్లు (PLA) ఎలాంటి దారుణాలకు పాల్పడతారో ఇవి ఋజువు చేస్తున్నాయని గ్రేట్ బ్రిటన్ కు చెందిన ‘ద సన్’ పత్రిక పేర్కొంది. వుహాన్ వైరస్ వెనక ఉన్న సీక్రెట్లను ప్రపంచం ముందు ఉంచేందుకు త్వరలోనే ఓ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించినట్టు సమాచారం.
వుహాన్ ల్యాబ్ లో ‘సార్స్ కరోనా వైరస్’ ఆధారంగా బయో వెపన్ అంటే జీవాయుధం తయారు చేస్తున్న క్రమంలో ఆ వైరస్ ప్రమాదవశాత్తూ బయట పడిందన్న సందేహాలకు ఈ కథనాలు మరింత బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు.
వుహాన్ వైరాలజీ పరిశోధనాలయం పరిశీలనకు విదేశీ మీడియాను అనుమతించక పోవడం కూడా ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. కేవలం వుహాన్ మార్కెట్ ను మాత్రమే సందర్శిస్తామంటే చైనా అనుమతించేదని, అసలు వైరస్ ఎలా పుట్టిందనే మూలాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో చైనా అడ్డుకుందని ఆస్ట్రేలియా వ్యూహాత్మక విధానాల సంస్థ కార్యనిర్వాహక అధినేత పీటర్ జెన్నింగ్స్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. అప్పుడు పరిశొధనల నిమిత్తం విచారణకు వెళ్ళిన ఐఖ్యరాజ్య సమితి పరిశీలకులను చైనా అధికారులు సైన్యం బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. యుఎన్ పరిశొధనలు ఋజువైతే చైనా అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడటం జరిగేది అందుకే చైనా విచారణలు కొనసాగకుండా అడ్దుకుంది అయితే, ఇందులో ఏ మాత్రం నిజం లేదని చైనా అడ్డంగా వాదిస్తుంది.