పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటించిన వకీల్ సాబ్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. హిందీ సినిమాకు రీమేక్‌గా వస్తున్నప్పటికి పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో మార్పులు చేసినట్టు టీజర్ ద్వారానే అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రంతో పాటు వరుసగా అనేక సినిమాలను పవన్ కల్యాణ్ లైన్‌లో పెట్టేశారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యపనమ్ కోషియం’ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు.  సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లేను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమానే కాకుండా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోనూ పవన్ కల్యాణ్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలతో పాటు తాజాగా మరో సినిమాను పవన్ కల్యాణ్‌ను లైన్‌లో పెట్టినట్టు సమాచారం వస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కూడా పవన్ కల్యాణ్ ఓ సినిమాలో నటించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికి.. పూరీ జగన్నాథ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో మాత్రం సినిమా కచ్చితంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌తో పవన్ కల్యాణ్ బద్రీ, కెమెరా మెన్ గంగతో రాంబాబు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని వార్తలు వస్తుండటంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: