ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020-21బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయని విమర్శించారు.  ప్రగతి కాముక రాష్ట్రమైన తెలంగాణ పురోగతిపై కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ప్రతికూల ప్రభావం చూపనున్నాన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధుల్లో  భారీ కోత విధించడం ద్వారా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు.


తెలంగాణకు కేంద్ర పన్నుల్లో  రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని మండి పడ్డారు. నిధుల్లో భారీ కోతలు విధించిన ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సీనియర్ అధికారులతో దాదాపు 4 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్ పై ఈ క్రింది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

 

రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది.జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదు.

 

14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదు. అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారు. ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: