రాష్ట్రంలోని దర్గాలను మంచి పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా తెలిపారు. నెల్లూరు జిల్లా రొట్టెల పండుగను పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి బాషా నెల్లూరు పర్యటన చేపట్టారు. ఈ సందర్బంగా కసుమూరు దర్గాను సందర్శించిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. మాజీ మంత్రి, వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిలు స్వగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి ఆయనకి దర్గా ప్రాంత ప్రాముఖ్యతను వివరించారు. దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాల్సిందిగా మైనారిటీ శాఖ మంత్రి అయిన అంజాద్ బాషాను కోరారు.ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరినట్టు చెప్పారు. అదే విధంగా అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆయా భూములను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు తాను ఇక్కడికి రావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి అనింటిలో విజయం చేకూర్చాలని ప్రార్థించామని చెప్పారు. అన్ని వర్గాల వారు కసుమూరుకు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారని చెప్పారు. ఈ దర్గా పవిత్రత ఎంతో గొప్పదన్నారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. కసుమూరు దర్గాలో ప్రార్ధనలు నిర్వహించేందుకు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారని చెప్పారు. ఇక్కడకు హిందు, ముస్లిం అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో వస్తుంటారన్నారు.
2004 లో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ దర్గా అభివృద్ధి పై దృష్టి పెట్టారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ తరవాత వచ్చిన వాళ్ళు ఈ దర్గా అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యే గా వచ్చిన తరువాత గతంలో అధికారం లేదన్న విషయాన్నిస్పష్టం చేశారు. ముస్లిం మైనారిటీలకు వై.యస్. కుటుంబం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి సూచనలు, సలహాలు తీసుకుని అభివృద్ధి పధంలో పయనిస్తామన్నారు. ఇందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి చేపడతామని చెప్పారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే దర్గాను అభివృద్ధి చేసి బాబా ఆశీర్వాదం పొందుతామని కాకాని అన్నారు.