
కొవిడ్ సమయంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించిన సమయంలో పోలీసుల బందోబస్తు నిర్వహించారు. కానీ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తాం అంటూ అర్జీ పెట్టుకుంటే మాత్రం కొవిడ్ నిబంధనలు అంటూ రూల్స్ పెట్టారు. ఇక కొంత మంది టీడీపీ నేతలపై పదేపదే వరుసగా కేసులు పెట్టడంపై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీడీపీ నేతలపై దాడులు జరిగిన సమయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైనే తిరిగి కేసులు పెట్టారు పోలీసులు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంపైనే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి యత్నించారంటూ ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడి జరిగితే... ఆయనపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసులు. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపైనే దాడి జరిగింది. ఇది పోలీసుల వైఫల్యంగా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడి విషయంపై చంద్రబాబు స్వయంగా డీజీపీకి ఫోన్ చేసినా కూడా... వేరే పనిలో ఉన్నానంటూ గౌతమ్ సవాంగ్ సమాధానం ఇచ్చారని.... ఇది ఆ శాఖ పనితీరుకు నిదర్శనం అని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. దాడి విషయం ముందుగా పోలీసులు గుర్తించలేకపోయారా... లేక తెలిసినా కూడా అధికార పార్టీకి భయపడి సైలెంట్గా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.