ప్రజలెవరు కోవిడ్ వాక్సిన్ ఉచితంగా ఇవ్వమని కోరలేదు. అది ప్రభుత్వ నిర్వహణలో ఉండాలని కోరేదెందుకంటే నల్లబజారుకు వాటిని చేర్చకుండా ఉంచాలని కోరటం మాత్రమే! మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ ప్రభుత్వాలు ఈ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించటంలోని ఔచిత్యం ఏమిటని - మచ్చుకు ఒక భారత పౌరుడు వాట్సాప్ సందేశం ద్వారా ప్రశ్నిస్తున్నారు. అలాగే తెలంగాణా రాష్టృఅ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సూటిగానే కోవిడ్ ప్రమాదం నుండి రోగులను ఎంతో కొంత తనకు చేతనైనంతగా సేవచేసే వైద్యుడు తన ఆవేదనను వెలిగక్కుతూ ప్రశ్నించారు. వీటికి సమాధానాలు చెప్పండి. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!  

 



1 గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి గారికిఆంద్ర ప్రదేశ్తెలంగాణ రాష్ట్రాలుమరియు దేశం లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు

(ఈ మెసేజ్ పాలకలుకు చేరెవరకు షేర్ చెయ్యండి అంటూ వచ్చిన వాట్సప్ సందేశం) 

 


నమస్తే!



ప్రజలందరికీ అవసరమయ్యే ప్రతి వస్తువును ఉచితంగా ఇవ్వక్కర్లేదు వ్యాక్సిన్ కూడా అంతే. మాకు మీరు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేవరకు మా ప్రాణాలు ఉండాలి కదా! 4 లక్షలు రూపాయలు ఆసుపత్రి బిల్లు కట్టే బదులు ₹400/- రూపాయలు వేక్సిన్ కి కడతాము సార్!



\కరోనా రాగానే ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీ లేక ప్రయివేట్ ఆసుప్త్రులకు వెళ్ళి అక్కడ సెలైన్ నీళ్ళకు 'రెమిడిసివర్' అని ₹30000/- నుండి ₹40000/- వేలు లేకుంటే లక్ష వరకైన కట్టే బదులు ₹300/- లేదా ₹400/- ₹600/- అయినా చెల్లించి మేము వేక్సిన్ వేయించు కుంటాము సార్! దయచేసి మాకు కనీసం ఆ అవకాశమైనా కల్పించండి.



18 నుండి 44 సంవత్సరం వయసు వారికి మీరు సెప్టెంబరులో వేక్సినేషన్ మొదలు పెట్టే వరకు మేము బతికి ఉండాలి కదా! అప్పుడు మాకు స్టే హోం అవకాశం ఉండదు కదా! 



కాని కళ్ళ ముందు మా తోటి సోదరులు ప్రాణాలు కోల్పోవటం మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. మేము ధైర్యంగా పనిచేసే పరిస్థితి కనుపడటం లేదు.  అందుకనే మా ఆవేదనను మీకు తెలియజేస్తున్నాము.



చాలా దేశాలలో మొట్ట మొదట  వేక్సినేషన్ చేసినా ఇక్కడ ఇప్పటి వరకు మా గురించి పట్టించుకోక పోయినా మేము బాధపడలేదు. కాకపోతే మా సోదరుల మరణాలు చూసి,         మా కుటుంబాలు గురించి మాకు భయం మొదలయినది.  అందువలనే మేము ఈ రోజు గొంతు విప్పి అడుగుతున్నాము.      

                


"మా వేక్సినేషన్ ఖర్చు మేమే భరిస్తాము. మాకు నచ్చిన వాక్సీన్ మా మండల కేంద్రాలలో "ఫీజ్ చెల్లించి వ్యాక్సిన్ వేయించుకునే పద్దతి" వాక్సీన్ కౌంటర్స్ ప్రారంభించండి.



45 సం. నిండిన వారికి కేంద్రప్రభుత్వం ఇచ్చే వాటితో కొంతమందికి, చెల్లించి వినియోగించుకొనే పద్దతిలో కొంతమందికి నాక్సీన్ ఇస్తే మిగిలిన వారికి రాష్ట్రప్రభుత్వం ఇవ్వచ్చు. అప్పుడు రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గవచ్చు.



ఒక ఆదివారం మాంసాహారం మానేస్తే లేదా రెండు రోజులు వైన్ షాపు మానేస్తే లేదా ఒక రోజు ఏదైనా పండుగ సినిమా మానేస్తే 60% ప్రజలు వేక్సిన్ కొనుక్కోగలరు. అది కూడ కొనుక్కోలేని నిరుపేద ప్రజలకు మీరు ఉచితంగా వాక్సీన్ ఇవ్వండి.



ఇది నా ఆవేదన మాత్రమే. మనవి...🙏🙏🙏




తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి,




కొవిడ్ మహమ్మారి నియంత్రణలో ఒక డాక్టర్‌ గా రోగులకు చికిత్స చేయడంతో పాటు ఇంకా పలువిధాల పాల్గొంటున్నాను. ఆసుపత్రిలో పడకలు అవసరమైన వారికి వాటిని ఏర్పాటు చేసే వాళ్లంగా (మాలో చాలా మందిమి ఫిజీషియన్ల కంటే బెడ్ మేనేజర్లమై పోయాం!), వాక్సిన్ సమకూర్చే వాళ్లం (ఇది మా సరికొత్త బాధ్యత)గా మిగిలి పోతున్నాం. మీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ ను వీక్షించిన తరువాత మీకీ బహిరంగ లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చాను.




‘ట్రెండ్ చాలా బాగుంది’ అనే వ్యాఖ్యతో మీరు మీ పత్రికా గోష్ఠిని ప్రారంభించారు. ట్రెండ్! ఒక సినిమా పంపీణీ దారు లేదా సినిమా హీరో తమ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నప్పుడు అలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. మరి మీరు ఏ ట్రెండ్ గురించి మాట్లాడారు?  సరే, అసలు విషయానికి వస్తాను. కొవిడ్ కేసుల సంఖ్య తగ్గిందని,  ఆక్సిజన్ పడకలు సరిపోయినన్ని ఉన్నాయని చెప్పారు కదా!  మీరు, నేను విలేఖర్లతో సహా ప్రభుత్వాసుపత్రులు అన్నిటికీ వెళదాం. అక్కడేం జరుగుతోందో చూద్దాం!  మీరన్నట్టు కేసుల సంఖ్య తగ్గిందని, ఆక్సిజన్ పడకలు సరిపోయినన్ని ఉన్నాయో? లేదో? స్వయంగా నిర్ధారించు కుందాం. ఆసుపత్రుల ఎదుట, లోపల సిసి టీవీ కెమెరాలను ఏర్పాటుచేసి టీవీ ఛానెల్స్‌తో వాటిని అనుసంధా నించండి. అప్పుడు మీరు చెప్పిన విషయాలపై నమ్మకం దృఢపడుతుంది.




ఫ్రాణాలను కాపాడే కొన్ని ఔషధాల కోసం మాకు రేయింబవళ్ళు అభ్యర్థనలు వస్తున్నాయి. అటువంటి ఔషధాల్లో ఒకటైన ‘రెమ్‌డెసివిర్‌’ కు కొవిడ్ నివారణలో చాలవరకు ఎటువంటి పాత్ర లేదని, ప్రతి కొవిడ్ రోగికి దానిని ఇవ్వకూడదని మీరు చెప్పారు. అయితే మహమ్మారి ఉగ్రతాండవం చేస్తూ ప్రజలు పిట్టల్లా రాలి పోతున్న వేళ కూడా అక్రమ నిల్వదారులు ఆ ఔషధ ధరను విపరీతంగా పెంచేశారు. రూ.700కు లభించాల్సిన ఆ ఔషధాన్ని రూ.30,000 నుంచి రూ.60,000 మధ్య అమ్ముతున్నారు. ఒక ప్రముఖ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఆ ఔషధాన్ని రూ.65,000కు కొన్నారన్న విషయం మీకు తెలుసునా? ఇప్పుడు చెప్పండి. ప్రాణ రక్షణకు అత్యంతావశ్యకమైన దానిని అక్రమంగా నిల్వచేసి అమ్ముకుంటూ అమితంగా సొమ్ము చేసుకుంటున్నవారిపై మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు?




మీరు ‘కొవిడ్ కిట్’ గురించి గొప్పగా చెప్పారు. అందులో ఉన్న ఔషధాలు ఏవీ కొవిడ్ చికిత్సలో ఉపయోగ పడేవి కావు. అదలా ఉంచండి, గత అనుభవాలను ఒకసారి గుర్తుచేసుకోండి. కొవిడ్ కిట్ లోని ఔషధాలను అక్రమంగా నిల్వచేసి మార్కెట్లో కొరతను సృష్టించారు. ఇప్పుడు వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు.




మరి మీరు మీ పత్రికాగోష్ఠిలో కొవిడ్‌ కిట్‌ను ప్రదర్శించడం సంబంధిత ఔషధాల అక్రమ నిల్వలను, వాటి అక్రమ విక్రయాలను ప్రోత్సహించడమే కదా! మీ సలహా మేరకు, మహమ్మారితో అల్లల్లాడిపోతున్న ప్రజలు ఆ ఔషధాలను తప్పక కొనుగోలు చేస్తారు. అయితే మార్కెట్లో అవి అందుబాటులో లేకపోవడ మనేది తప్పక సంభవిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఆక్సిజన్ సిలిండర్లు, మందులను అక్రమంగా నిల్వ చేస్తున్నవారిపై మీరు ఎందుకు దాడులు నిర్వహించరు?




అన్ని రాష్ట్రాలు వాక్సిన్లను తమకు తామే కొనుగోలు చేసుకోవాలని గత నెలలో కేంద్రం స్పష్టం చేసింది. ఏ ధరలకు వాటిని కొనుగోలు చేయాలో కూడా నిర్దేశించింది. ఈ విషయమై కంపెనీలతో ఇంతవరకు మీరు ఒక తుది ఒప్పందానికి ఎందుకు రాలేదు? రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ టీకాను ఉచితంగా వేయిస్తామని ముఖ్యమంత్రి (లు) ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ద్వారానే వాక్సినేషన్ జరుగుతుందని అన్నారు. మీరు టీకా వేయించుకోవడానికి మీ పేరు రిజిస్టర్ చేయించుకోవలసిన అవసరం లేదు. అయితే ఒకసారి అలా చేసి చూడండి. ఏమి జరుగుతుందో మీకే తెలిసివస్తుంది. రిజిస్టర్ చేయించు కునేందుకు ఆన్‌లైన్ కొవిన్ యాప్‌ ను ఓపెన్ చేసిన కొద్ది క్షణాలకే అది క్లోజ్ అవుతుంది. ఎంతకూ మళ్ళీ ఓపెన్ కావడం లేదు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందా! అని అసంఖ్యాక ప్రజలు వేచి ఉండి ఓపెన్ కాగానే క్లిక్ చేస్తున్నారు. ఫలితంగా కొద్ది సెకన్ల లోనే మీరు నిర్దేశించిన కోటా పూర్తవుతుంది. దాంతో మరెంతోమంది తమ పేరు రిజిస్టర్ చేయించుకో లేకపోతున్నారు.




కొవిడ్ సంక్షోభవేళ అనవసరమైనప్పటికీ ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత ఒక మంత్రిని తొలగించారు. అదీ ఆరోగ్యశాఖ మంత్రిని! ఈ విపత్తు యుద్ధ కాలపు పరిస్థితులను సృష్టించింది. అయితే ఒక యుద్ధంలో వలే మీరు ఆ పరిస్థితులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారా?




మునిసిపల్ ఎన్నికలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించారు. ఎన్నికైన కార్పొరేటర్లు కొవిడ్ బాధితులను ఆదుకుంటున్నారా? బాధితులు కాని వారికి సంపూర్ణ భద్రత కల్పించేందుకు శ్రద్ధ వహిస్తున్నారా? ప్రభుత్వాసుపత్రులలో కొవిడ్ రోగులకు చాలా పడకలు అందుబాటులో ఉన్నాయని మీరు ప్రకటించారు. మరి పలు హోటళ్ళను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చివేసేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారు? సంపన్నుల కోసమే కదూ! మరి పేదల విషయమేమిటి? వారు ఎక్కడకు వెళ్ళాలని మీరు కోరు కుంటున్నారు?




కొవిడ్ రెండో ధఫా విజృంభణను అదుపు చేసేందుకు, మనలను మరింత విషమంగా ప్రభావితం చేయనున్న మూడో, నాలుగో దఫా విజృంభణను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నదీ మీరు వివరించనే లేదు. అటువంటి విపత్తులు, అవాంతరాలను ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధమవ్వడం మీ బాధ్యత కాదా?




కొవిడ్ మొదటి దశలో, ఆస్పత్రుల్లో పడకల కొరత గురించి వివరణ ఇస్తూ మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడిన కారణంగానే ఆ సమస్య ఏర్పడిందని మీరు సహేతుకంగా పేర్కొన్నారు. అయితే రెండో దఫా విజృంభణలో సైతం పడకల కొరత ఎందుకు అంత తీవ్రంగా ఉంది? తొలిదశ మొదలైన సంవత్సరం అనంతరం కదా! రెండో దఫా విజృంభణ ప్రారంభమయింది? మరి ఇప్పుడు కూడా పడకల కొరత తీవ్రంగా ఉండడానికి కారణమేమిటి?




పత్రికా గోష్ఠిలో మీరు మాస్క్ ఎందుకు ధరించ లేదు? మీ పక్కన కూర్చున్న వారందరూ మాస్క్‌లు ధరించారు. మహమ్మారిని అదుపు చేసేందుకు అత్యంత ప్రభావశీల చర్యను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకారదర్శి గా మీరే పాటించక పోవడం ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది?




విలేఖర్ల సమావేశంలో మీరు మీ జూనియర్లను మాస్క్‌లు తొలగించాలని ఆదేశించడం గర్హనీయం. దీనికి తోడు మీరు చేతులు అడ్డం పెట్టుకుని దగ్గారు. ముక్కును రద్దుకున్నారు. వైరస్ వ్యాప్తికి దోహదం చేసే ఇటువంటి పనులు మీరు చేయవచ్చునా? పత్రికా గోష్ఠిలో మీరు బిస్కట్లు తినడం కూడా ఏమాత్రం హర్షణీయం కాదు.




రాష్ట్రంలో అత్యంత ముఖ్య అధికారి ఇలా వ్యవహరిస్తే, కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలా సంసిద్ధం చేస్తున్నారో? ఇక చెప్పవలసిన అవసరమున్నదా?

 



డాక్టర్ పి. వినయ్ కుమార్ (చైర్మన్సామాజిక అధికార వేదిక) 



(ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడ్డ లేఖ)



మరింత సమాచారం తెలుసుకోండి: