ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే దేశమంతా దృష్టి సారించింది. ఎప్పుడో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నెలలో వస్తాయని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం.... అందరికీ షాక్ ఇచ్చేసింది. ఫిబ్రవరి నెల 10వ తేదీ నుంచి మార్చి నెల 7వ తేదీ వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించేసింది. మరో మూడు రోజులకు ఫలితాలు కూడా వెల్లడిస్తామని సీఈసీ వెల్లడించింది. దీంతో అన్ని పార్టీల నేతలు ఎన్నికల గోదాలో తమ సత్తా ఏమిటో చాటుకునేందుకు రెడీ అవుతున్నాయి. పేరుకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయినప్పటికీ... అందరి కళ్లు మాత్రం ప్రధానంగా ఆ రెండు రాష్ట్రాలపైనే ఉన్నాయి. అవే దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా... ఈ రెండు రాష్ట్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ... కేంద్రంలో చక్రం తిప్పుతుందని గట్టి నమ్మకం.

యూపీలో 400 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అయితే ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ సర్కార్‌ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీతో పాటు... విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీతో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్ వాదీ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ప్రియాంకా గాంధీ వాద్రా.... యూపీ ఎన్నికల బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు. దాదాపు రెండేళ్లుగా యూపీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు ప్రియాంక. అదే సమయంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు. మహీళల కోసం ప్రత్యేకంగా ఓ మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని కూడా ప్రియాంక ప్రకటించారు. కానీ సర్వే ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. 400 పైగా స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండే స్థానాలు గెలుచుకుంటుందని ఏబీపీ - సీ ఓటర్ సర్వే నివేదిక విడుదల చేసింది. ఇదే నిజమైతే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: