‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుందా.. చూసేద్దాం అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీని కొద్ది నిమిషాల క్రితం చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. నీరు, నిప్పు అన్‌స్టాపబుల్ ఫోర్స్‌ను అక్టోబర్ 13న చూడబోతున్నారంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇండియన్ సినిమాను ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు సిద్దమవ్వండి అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు.  కాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్ అన్న సమయంలోనే ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించబోతున్నారని తెలిశాక బాహుబలిని మించిన అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు టీజర్లు విడుదల కాగా.. రెండింటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ షూటింగ్ కూడా మొదలైందంటూ ఇటీవల దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ చిత్రం 2020 జూలైలోనే రావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో 2020 జూలై నుంచి 2021 జనవరికి పోస్ట్ పోన్ అయింది.

అయితే మళ్లీ 2021 జనవరిన కూడా ఈ చిత్రం రావడం లేదని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ చిత్రం 2021లో కూడా వచ్చే అవకాశం లేదని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ.. తాజా అప్డేట్‌తో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొంత మంది అభిమానులు మాత్రం అక్టోబర్ 13వ తేదీ కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చని, రాజమౌళి ఈ సారి కూడా సినిమాను కచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తాడంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: