
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఊహించని రీతిలో వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రధానంగా అధికార బీజేపీ కేంద్రంగా...పెద్ద ఎత్తున పలువురు నేతలు మీడియాలో వైరల్ అవుతున్నారు. ముంబయి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మంగల్ ప్రభాత్ లోధా ప్రస్తుతం పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. ప్రభాత్ ఆస్తులు రూ. 441 కోట్లు అని ఎన్నికల ఆఫిడవిట్లో తేలింది. ప్రభాత్, ఆయన భార్యకు సంబంధించి రూ. 252 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు.ముంబయిలోని మలబార్ హిల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.ప్రభాత్ అఫిడవిట్ ప్రకారం, చరాస్తులు రూ. 189 కోట్లు ఉన్నాయి. రూ. 14 లక్షల విలువ చేసే కారు ఉంది. అప్పులు రూ. 283 కోట్లు. దక్షిణ ముంబయిలో ఐదు బహుళ అంతస్తుల భవనాలు, రాజస్థాన్లో ఒక ప్లాట్ ఉంది. తనపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీన జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 24న నిర్వహించనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 125 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదలచేసింది. శివసేనతోపాటు కొన్ని చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారు. కాగా, 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించలేదని తెలిపారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ), రాష్ట్రీయ సమాజ్ పక్ష్, శివ్ సంగ్రామ్ సంఘటన, రయత్ కాంత్రి సేన తదితర పార్టీలతో కలిసి మహా యుతి (మహా కూటమి) ఏర్పాటు చేశామన్నారు. నాగ్పూర్ సౌత్వెస్ట్ సీటు నుంచి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పుణెలోని కొత్రూడ్ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పోటీ చేస్తారని అరుణ్ సింగ్ మీడియాకు తెలిపారు.
కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు నితేశ్ రాణే బీజేపీ టికెట్పై పోటీ చేస్తాడని మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే తెలిపారు. నితేశ్ రాణే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కంకవ్లి స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి బీజేపీ అభ్యర్థి ప్రమోద్ జతర్పై గెలుపొందారు. తన వారసుడిని బరిలో దింపడం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ..నా కుమారుడు నితేశ్ రాణే కంకవ్లి అసెంబ్లీస్థానం నుంచి పోటీచేస్తాడు. బీజేపీ విడుదల చేయనున్న రెండో జాబితాలో నితేశ్ పేరుంటుందని తెలిపారు.