న్యూఢిల్లీ: సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కొద్ది నెలల క్రితం భారీగా నిరసనలు జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ ఎత్తున ప్రజలు ఆందోళనలు చేశారు. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో ఓ యువకుడు తుపాకీ తీసుకుని వచ్చి నడిరోడ్డుపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లు కాల్పులు జరిపి.. ‘జై శ్రీరాం’, ‘మా దేశంలో హిందువులు మాత్రమే ఏదైనా చెప్పాలి. ఇంకొకరు చెప్పకూడదు’’ అంటూ నినాదాలు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని ఢిల్లీ అరెస్ట్ చేశాడు. అతడి పేరు కపిల్ గుర్జార్. తాజాగా గుర్జార్ బీజేపీలో చేరాడు. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యప్తంగా చర్చనీయాంశమైంది.

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో గుర్జార్‌ బుధవారం పార్టీలో చేరాడు. అక్కడి బీజేపీ నాయకులు అతడికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం గుర్జార్ మాట్లాడుతూ ‘నేను బీజేపీలో చేరడానికి ఎప్పుడో సిద్ధమయ్యాను. బీజేపీ హిందుత్వం కోసం పని చేస్తుంది. అందువల్లే తాను ఈ పార్టీలో చేరాన’ని చెప్పుకొచ్చాడు. షహీన్‌బాగ్‌లో తాను జరిపిన కాల్పుల గురించి కూడా గుర్జార్ మాట్లాడాడు. సీఏఏ వ్యతిరేకుల కారణంగా ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయిందని, ఆ నిరాశతోనే కాల్పులు జరిపానని అన్నాడు. ఇంట్లో తన సోదరి వివాహం పెట్టుకున్నారని, అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా పెళ్లి పనులు చేసుకోలేకపోయామని, ఆ నిరాశతోనే నిరసన చేస్తున్న ప్రదేశంలో కాల్పులు జరిపినట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో గుర్జార్ తెలిపాడు.

ఇదిలా ఉంటే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగిన నిరసనలు ఒక ఎత్తయితే ఢిల్లీలో జరిగిన ఆందోళనలు మరో ఎత్తు. ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరవధిక నిరసన నిర్వహించారు. ఈ ఆందోళనలకు మహిళల నేతృత్వం వహించడం దేశ వ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారాన్నే సృష్టించింది. ఒకవేళ కరోనా రాకుంటే ఈ ఆందోళన నిరవధికంగా కొనసాగేదే. అయితే కరోనా విజృంభించడం, లాక్‌డౌన్ విధించడంతో మార్చి చివరి వారంలో తమ ఆందోళనను విరమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: