ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.  ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత బలోపేతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తుందని కేసీఆర్ తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు 5 ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్ చేయించకుని, మ్యుటేషన్ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.  వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్ది పాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సిఎం ప్రకటించారు. ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా పోర్టల్ లో జరగాల్సిన కొన్ని మార్పులను కేసీఆర్ అధికారులకు సూచించారు.

రిజిస్ట్రేషన్ లో భాగంగా రైతులు ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజు రాలేకపోతే వారికి స్లాట్ రద్దు చేసుకోవడానికి, అలానే మరో రోజు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నచో డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలని అన్నారు.  స్లాట్ బుక్ చేసుకునే సందర్భంగా వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్ బుక్ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్ కన్నా ముందు అవకాశం కల్పించాలని సూచించారు. చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ కల్పించాలని సూచించారు.  మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో మైనర్లు మరియు సంరక్షుల పేర పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలన్నారు.  ప్రభుత్వం అసైన్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: