దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ని మహి వి.రాఘవ డైరెక్ట్ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కావడంతో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో చోటుచేసుకున్న కీలక సంఘటనలు, సంక్షేమ పథకాలు ఎలా రూపొందించారన్న అంశాలను ఎంతో అద్భుతంగా మహి వీ రాఘవ యాత్ర సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎంతో అద్భుతంగా నటించారు. ఇక యాత్ర సినిమాకి సీక్వెల్ ఉంటుందని విడుదల సమయంలోనే డైరెక్టర్ తెలిపాడు.

అయితే యాత్ర సినిమా విడుదలై సుమారు నాలుగేళ్లు అవుతున్న ఇప్పటికీ ఇంకా సీక్వెల్ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ 'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు మహి వి రాఘవ యాత్ర సీక్వెల్ యాత్ర-2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన యాత్ర 2 ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పేశాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇక 'యాత్ర 2' చిత్రం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజశేఖర్ రెడ్డి మరణం ఆ తర్వాత అతని కొడుకు జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు చివరికి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు అన్న ఇతివృత్తంతో ఈ సీక్వెల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు యాత్ర సీక్వెల్లో జగన్ పాత్ర కోసం స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈసారి ఫ్యాన్ ఇండియా లెవెల్ లోనే ఈ సీక్వెల్ని తెరకెక్కించి 2024 లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి యాత్ర సీక్వెల్లో వైయస్ జగన్ వ్యక్తిగత జీవితానికి కు సంబంధించి ఎలాంటి అంశాలను దర్శకుడు ఈ మూవీలో చూపిస్తాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: