మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలన వార్తగా మారింది. అయితే ఈ వార్తకు సంబంధించిన ఓ పత్రికలోని ఆర్టికల్‌ను ప్రముఖ హీరోయిన్‌ తాప్సి ట్యాగ్‌ చేస్తూ..
'అనుమానంతో తల పగలగొట్టాడా? బహుశా వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉన్నారేమో. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి ఆమెను చంపేశాడేమో' అంటూ, ఇటీవల దర్శకుడు సందీప్‌ రెడ్డి చేసిన కామెంట్‌కి కౌంటర్‌ ఇచ్చింది తాప్సి.

సందీప్‌ రెడ్డి వంగాకు తన కామెంట్‌తో చురకలంటించారు సినీ నటి తాప్సి. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన 'కబీర్‌ సింగ్‌' చిత్రంలో షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ ఒకరిపై ఒకరు చేయిచేసుకుంటారు. దీని పై సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో .. ' ప్రేమలో ఉన్నప్పుడు చాలా నిజాయతీ ఉంటుంది. ఒకరిపై మరొకరు చేయి చేసుకునే స్వేచ్ఛ లేనప్పుడు అక్కడ ప్రేమ, ఎమోషన్‌ ఉంటుందని నేను అనుకోను. ఓ అబ్బాయి తన సొంతం అనుకున్న అమ్మాయిని ముట్టుకోలేనప్పుడు, కొట్టలేనప్పుడు ఆ బంధంలో ఎమోషన్‌ ఏముంటుందీ' అన్నాడు.

దీనికి సమాధానంగా తాప్సి పై విధంగా ట్వీట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో పంచ్‌లు మొదలయ్యాయి.
దీనిపై తాప్సి మరో ట్వీట్‌లో ' హాస్యచతురత లేని వారు నా ట్వీట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అన్నారు. అసలు 'కబీర్‌ సింగ్‌' మీదే అనేక విమర్శలు వస్తున్న సమయంలో సందీప్‌ రెడ్డి వ్యాఖ్యలు వివాదస్పదం అయాయి. దీనిపై సమంత, చిన్మయి శ్రీపాద, తదితరులు డైరెక్టర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే !! 


మరింత సమాచారం తెలుసుకోండి: