కుండపోత వాన... భారీ వరద... రాయలసీమ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కడప, చిత్తూరు జిల్లాలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. వందల గ్రామాల్లో వరద నీటిలో మునిగిపోయాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంట నీటిపాలైంది. గతంలో ఎన్నడూ లేనంత వరద రాయలసీమ ప్రాంతం వరద ముంపులో చిక్కుకుంది. అదే సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్య క్షేత్రం ప్రస్తుతం వరద నీటిలో ఉంది. శ్రీవారు కొలువైన ఆనంద నిలయం దేవస్థానం నాలుగు మాఢ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. క్యూ కాంప్లెక్స్‌లోకి వర్షం నీరు చేరింది. ఇక కనుమ దారుల్లో కొండ రాళ్లు దొర్లిపడుతున్నాయి. మెట్ల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటికే తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు. తిరుమలకు భక్తులు ఎవరూ రావద్దని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని గో గర్భం డ్యామ్, పాపనాశనం డ్యామ్ పూర్తిగా నిండిపోయాయి. డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక కపిల తీర్థం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీటీడీ అధికారులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం మూసివేశారు. ఇక తిరుమల, తిరుపతిలో ఉండిపోయిన భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస, భోజన సదుపాయం కల్పించాలని అధికారులను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. తిరుమల, తిరుమతి రెండో ఘాట్ రోడ్ మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు. తిరుమలలో ఉన్న భక్తులు... వారికి కేటాయించిన వసతి గదుల్లోనే బస చేయాలని సూచించారు ఈవో. ప్రతి ఒక్కరికీ భోజనం అందుతుందని ఈవో వెల్లడించారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తిరుపతిలో ఉండిపోయిన భక్తులు శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రం, పద్మావతి నిలయంలో బస చేయవచ్చన్నారు. ఇప్పటికే శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా దర్శనం బుక్ చేసుకున్న వారికి స్వామి వారి దర్శన భాగ్యం తప్పకుండా కలిగిస్తామన్నారు. భక్తులు ఆన్ లైన్ టికెట్ తీసుకువస్తే సరిపోతుందన్నారు. ఈ విషయంపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఇక తిరుమలలో పరిస్థితి దారుణంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: