మార్గదర్శి చిట్ ఫండ్ మోసాలపై విచారణ చేస్తున్న సీఐడీ దూకుడుపెంచింది. ఇప్పటికే ఈ విషయంలో సంస్ధ ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండీ శైలజను విచారించిన విషయం తెలిసిందే. రెండోసారి మళ్ళీ వీళ్ళిద్దరినీ విచారించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలోనే మార్గదర్శికి మద్దతుగా, సీఐడీ వ్యతిరేకంగా సదస్సులు, మీడియా సమావేశాలు నిర్వహిస్తు, కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళని కూడా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. మార్గదర్శి వ్యవహారంలో కొందరు రామోజీని సమర్ధిస్తు మీడియా సమావేశాలు పెడుతున్నారు.





అలాగే సదస్సులు పెట్టి సీఐడీ కక్షసాధింపు చర్యలు సాధిస్తున్నట్లు మండిపోతున్నారు. మరికొందరు రామోజీకి మద్దతుగా సీఐడీకి వ్యతిరేకంగా ఫిర్యాదులు కూడా చేశారు. ఇలాంటి వాళ్ళకి సీఐడీ నోటీసులు ఇవ్వబోతోంది. రామోజీని సమర్ధిస్తున్న వాళ్ళదగ్గర ఎలాంటి సమాచారం ఉందో తమకు ఇవ్వాలని నోటీసుల్లో సీఐడీ కోరబోతోంది. అలాగే తమను తప్పుపడుతున్న వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉందో తెలుసుకోవాలని సీఐడీ అనుకుంటోంది.





రామోజీని సీఐడీ వేధిస్తోందని జీవీఆర్ శాస్త్రి అనే ప్రొఫెసర్ ప్రధానమంత్రికి ఫిర్యాదుచేశారు. రామోజీని విచారించటాన్ని వేధింపులుగా ప్రొఫెసర్ ఎలా ఫిర్యాదు చేశారో తెలుసుకోవాలని సీఐడీ అనుకుంటోంది. అలాగే నందిగామలో సదస్సు నిర్వహించి రామోజీ ఎలాంటి తప్పుచేయలేదని తీర్మానించారు. అలా తీర్మానం చేయటానికి సదస్సు నిర్వాహకుల దగ్గరున్న ఆధారాలు ఏమిటో చూపించమని సీఐడీ నోటీసుల్లో అడుగుతోంది. విజయవాడలో ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం పేరుతో సమావేశం నిర్వహించిన నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వబోతోంది. టీడీపీ నేతలు, మద్దతుదారులంతా ఒక్కొక్కళ్ళుగా రామోజీకి మద్దతుగా బయటకు వస్తున్నారు. వీళ్ళు చెప్పేదేమిటంటే రామోజీ ఏమిచేసినా ఒప్పే కేసులు పెట్టకూడదు, విచారణ చేయకూడదట.






సమావేశంలో వక్తలు ఆడిటర్ అరెస్టును ఖండిస్తు, రామోజీపైన చర్యలు తీసుకోవటాన్ని తప్పుపట్టారు. తమ ఖండనలకు మద్దతుగా తమ దగ్గరున్న ఆధారాలు ఏమిటో చెప్పమని  సీఐడీ  నోటీసుల్లో అడుగుతోంది. రామోజీ విచారణను తాము చట్టబద్దంగానే చేస్తున్నామని సీఐడీ స్పష్టంగా చెబుతోంది. ఏ చట్టం ప్రకారం రామోజీ నిబంధనలను ఉల్లంఘించారు, మార్గదర్శి వ్యాపరం ఏ విధంగా చట్టానికి వ్యతిరేకమో సీఐడీ స్పష్టంగా విచారణలో రామోజీ, శైలజకే వివరించింది. అలాంటిది మధ్యలో ఎలాంటి సంబంధంలేని వాళ్ళు జోక్యం చేసుకుని దర్యాప్తును ప్రభావితం చేయబోతున్నారని సీఐడీ అభిప్రాయపడుతోంది. అందుకనే వాళ్ళదగ్గరున్న సమాచారాన్ని తెలుసుకునేందుకే నోటీసులు ఇస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: